'ఖడ్గం' సినిమా కేసులు కొట్టివేత, 12 ఏళ్లకు విముక్తి
హైదరాబాద్: హిందూపురంలో 2002 డిసెంబర్ 21న 'ఖడ్గం' సినిమా ప్రదర్శన సందర్బంగా చెలరేగిన అల్లర్ల కేసును హిందూపురం కోర్టు బుధవారం కొట్టి వేసింది. ఖడ్గం సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల మత పరంగా కించపరిచేలా ఉన్నాయన్న నేపథ్యంలో హిందువులు, ముస్లింలు పరస్పరం ఆందోళనలకు దిగడమే కాకుండా... ర్యాలీలు కూడా నిర్వహించారు.
దీంతో పోలీసులు లాఠీ చార్జీ, గాలిల్లోకి కాల్పులు లాంటి భయానకర వాతారణంతో హిందూపురం మొత్తం అట్టుడికింది. ఈ సంఘటనల్లో ఉమర్ ఫరూక్, మాజీ మతవల్లి అజీజ్, బాబా, ఫరూక్, సాధిక్లతో పాటు సుమారు 53 మందిపై కేసు నమోదైంది. మొదటగా ఆందోళన చేసిన కేసులో హిందూపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ విద్యాసాగర్, రమేష్ రెడ్డి, గోపాల్, నాగరాజు, శివకుమార్లతో పాటు మరో 15 మందిపై కేసు పెట్టారు.
ఈ కేసుల్లో చాలా మంది జైలు పాలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులపై సాక్ష్యాధారాలు రుజువు కాకపోవడంతో జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ కోర్టు జడ్జి గీతా మొదటి కేసులోని 15 మందిపై కేసు కొట్టి వేశారు. ఆ తర్వాత కేసులోని 36 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమర్ ఫరూక్, మాజీ మతవల్లి అజీజ్, బాబా, ఫరూక్, సాధిక్ వర్గంలోని 26 మందిపై గత జులై నెల్లో కోర్టు కేసులు కొట్టి వేసింది. 12 సంవత్సరాల తర్వాత ఈ కేసు నుండి విముక్తి పొందడంతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.