సొంతింటికి కిరణ్, ప్రజలకు సారీ: ఆటోలో శైలజానాథ్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సొంతింటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించానని, విభజనను అడ్డుకోలేక పోయినందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలుగు ప్రజల ఏకాభిప్రాయంతో జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)లో లోపాలు ఉన్నాయని, విభజనలో ప్రతి దశలు జరిగాయని ఆయన అన్నారు. కాగా, కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆటోలో వెళ్లిన శైలజానాథ్
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో మాజీ మంత్రి శైలజానాథ్ తన అధికారిక వాహనం అయిన కారును సిఎం క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు.
విభజన రాజ్యాంగ విరుద్ధం: కోట్ల
లోకసభలో రాష్ట్ర విభజన తీరు రాజ్యాంగ విరుద్దమని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ విభజనలో కాంగ్రెస్ కంటే బిజెపి పాత్రే ఎక్కువ అన్నారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరగకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదానికి బిజెపి ఎలా ఒప్పుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తున్నామని కోట్ల తెలిపారు.