చిరుకు చెక్ చెప్పేందుకేనా?: దాసరితో కిరణ్ మంతనాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్నారు. ఇందుకోసం ఆయన దర్శకరత్న దాసరి నారాయణ రావుతో సహా పలువురితో మంతనాలు జరుపుతున్నారు. శుక్రవారం దాసరితో సహా పలువురు ముఖ్యులతో కిరణ్ భేటీ అయ్యారు. దాసరితో కిరణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన దాసరికి సీమాంధ్రలో కొంత పట్టుంది. కిరణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రారంభంలోనే దాసరి ఇంటికి వెళ్లారు. కేంద్రమంత్రిగా చిరంజీవి బాధ్యతలు స్వీకరించనున్న సమయంలోను దాసరితో కిరణ్ భేటీ అయ్యారు.
గత కొద్ది రోజులుగా దాసరితో కిరణ్ టచ్లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త పార్టీని స్థాపించనున్న తరుణంలో దాసరిని పార్టీలోకి పిలిచేందుకే ఆయన భేటీ అయ్యారని అంటున్నారు.
టాలీవుడ్లో దాసరి నారాయణ రావుకు, చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. చిరు తన పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయగానే దాసరి తప్పుకున్నారు. మరోవైపు తన పార్టీని కాంగ్రెసులో కలిపిన చిరంజీవి... ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయమై కిరణ్, చిరు, బొత్సల మధ్య విభేదాలు కూడా వచ్చినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో దాసరితో కలిసి సీమాంధ్రలో చిరంజీవికి చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగానే కిరణ్ ఆయనను కలిసి ఉంటారని అంటున్నారు.
కాగా, కిరణ్ తన పార్టీకి జై సమైక్యాంధ్ర, జై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ జెండా, అజెండాపై చర్చలు జరుగుతున్నాయి. చెప్పు లేదా బ్యాటు గుర్తు ఉండనుంది. రాజమండ్రి సభలో ఉద్యమ పార్టీగా ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ఈ పార్టీకి ప్రచారకర్తగా గజల్ శ్రీనివాస్ ఉండనున్నారు.