కిరణ్పై అప్పుడే చెప్పా:పెద్దిరెడ్డి, కెవిపి అంశంపై పొన్నాల
హైదరాబాద్/చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి భయంతోనే ఎన్నికల బరి నుండి తప్పుకున్నారని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదివారం అన్నారు. డిపాజిట్లు కూడా రావని పార్టీ పెట్టినప్పుడే తాను చెప్పానని గుర్తు చేశారు. సోనియా గాంధీకి తప్పుడు సమాచారమిచ్చి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
జగన్ లేని లోటును తాను తీరుస్తానంటూ ఢిల్లీ పెద్దలకు కిరణ్ మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో పీలేరు నుంచి తప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తన సోదరుడిని నిలబెట్టారని, అది ఓటమి భయంతోనే అని ఎద్దేవా చేశారు.
అప్పుడే ఎందుకు చెప్పలేదు: పొన్నాల
కెవిపి తనను డబ్బుతో కొనేందుకు ప్రయత్నించారని కెసిఆర్ చేసిన ఆరోపణలను టి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. కెసిఆర్ తప్పుడు ముచ్చట చెబుతున్నారన్నారు. ఏనాడూ పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడని కెసిఆర్ను, ఫామ్ హౌస్లో పడుకున్న కెసిఆర్ను కొనాల్సిన అవసరం ఏముందన్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
కెసిఆర్ పైన వెంకయ్య
కెసిఆర్ పైన బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత్యంతరం లేకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఆలస్యానికి, వెయ్యి మంది బలిదానాలకు కాంగ్రెస్, తెరాసలదే బాధ్యత అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్ తమ పార్టీ పైన బురద జల్లుతున్నారన్నారు. బిజెపితో పొత్తుకు కెసిఆర్ ఎందుకు ముందుకు వచ్చారో చెప్పాలన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కింద పని చేసిన విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు. బిజెపి-టిడిపిది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను వెంకయ్య తప్పుపట్టారు. గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కెసిఆర్ మరచిపోతే ఎలా అన్నారు.