సానియాకేమో కోటి, ఆ బకాయిలేమో..: కిషన్ రెడ్డి
హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కోటి రూపాయలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం క్రీడా సంఘాల బకాయిలను మాత్రం నిలిపేసిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం సచివాలయం దాటడం లేదని ఆయన అన్నారు.
విద్యుత్తు కోతల వల్ల పలు పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పొదుపు సంఘాలు, రైతుల రుణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బోధనా రుసుములపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఆగస్టు రెండో వారంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా హైదరాబాదులో పర్యటిస్తారని ఆయన కిషన్ రెడ్డి అన్నారు.
ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్తు
కాగా, ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి మిగులు విద్యుత్తును కొనుగోలు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చర్యలు ప్రారంభించారు. ఇందుకుగాను బుధవారంనాడు తెలంగాణ అధికారులు ఛత్తీస్గడ్ వెళ్లనున్నారు.