కెసిఆర్ దుకాణం బంద్: కిషన్, టిలో మళ్లీ మోడీ సభలు
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కె చంద్రశేఖర్ రావుపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 11వందల మంది ఆత్మబలిదానాల వల్లే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ఉద్యమంలో తెలంగాణ రాజకీయ జెఏసి, బిజెపిదే కీలక పాత్ర అని అన్నారు.
తెలంగాణ కోసం పార్లమెంటులో ఒక్కసారి కూడా కెసిఆర్ మాట్లాడలేదని విమర్శించారు. అలాంటి కెసిఆర్తో తెలంగాణ వచ్చిందనడం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి అన్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ దుకాణం మూతపడినట్లేనని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్, టిఆర్ఎస్ కంటే బిజెపిదే కీలక పాత్ర అని అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలకు వస్తున్న ఆదరణ చూసి కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు.
కుటుంబ పార్టీలు సామాన్యులను పట్టించుకోవని కిషన్ రెడ్డి అన్నారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు నిలయంగా మారిందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితేనే దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని నిమ్స్గా మారుస్తామన్నారు.
సింగరేణి కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు వరకు రైల్వే లైను కోసం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. బిజెపి నేత జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీని నమ్మొద్దని అన్నారు. మోడీ ప్రధాని అయితే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని అన్నారు.
తెలంగాణలో మళ్లీ మోడీ సభలు
తెలంగాణలో నరేంద్ర మోడీ సభలకు వస్తున్న ఆదరణతో బిజెపి శ్రేణులు ఊపుమీదున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో రెండు సభలను తెలంగాణలో నిర్వహించాలని బిజెపి నాయకులు కసరత్తులు చేస్తున్నారు. ఏప్రిల్ 27 లేదా 28 తేదీల్లో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.