ప్రజలు కావాలా..రజాకార్లా?: కెసిఆర్కు కిషన్, కోటపైనా..
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం ఉదయం తెలంగాణ విమోచన దినం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్కు తెలంగాణ ప్రజలు కావాలా? లేక రజాకార్లు కావాలా? అని ప్రశ్నించారు. గతంలో అధికారికంగా నిర్వహించాలన్న కెసిఆర్.. ఇప్పుడెందుకు అధికారికంగా నిర్వహించడం లేదు అని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు.
ఎంఐఎంకు తలొగ్గిన కెసిఆర్.. విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విమోచన దినోత్సవ వేడుకల్లో ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా గోల్కొండ కోటలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆరుగురు బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
గోల్కొండ వద్ద భారీ భద్రత
బిజెపి నాయకులు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేస్తామని చెప్పిన నేపథ్యంలో డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో కోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట వరకు బిజెపి నాయకులు రాకుండా నాకాబందీ ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను ఎక్కడైనా ఆవిష్కరించవచ్చని, దానికి తాను వ్యతిరేకం కాదని డిసిపి సత్యనారాయణ చెప్పారు.
లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది కలగకుండా 300మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిసిపి సత్యనారాయణ తెలిపారు. జాతీయ జెండా ఆవిష్కరించాలంటే ఆర్కియాలజీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. బిజెపి నాయకులు అందుకు కావాల్సిన అనుమతి తీసుకోలేదని తెలిపారు. గోల్కొండ కోటను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు.