రాజధానిపై కొత్త ట్విస్ట్: జగన్ పార్టీకి స్పీకర్, వాగ్వాదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే. రాజధాని పైన ఓటింగ్ జరపాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలో సభాపతి కోడెల శివప్రసాద్ బుధవారం స్పందించారు. ఆ పార్టీని పిలిచి మాట్లాడారు. రాజధాని ప్రకటన ముందైనా, తర్వాతనైనా చర్చ పెట్టవచ్చునని కోడెల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సూచించారు. రెండు పద్ధతులూ సాధ్యమేనని చెప్పారు.
మీడియా పాయింట్ వద్ద వాగ్వాదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రాజధాని పైన ఇది సరైన పద్ధతి కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనగా, పద్ధతుల గురించి మీ నుండి మేం నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ సమాధానమిచ్చింది.
జగన్ను కలిసిన కంతేటి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ బుధవారం ఉదయం కలిశారు. డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన తనకు మద్దతివ్వాలని కోరారు. తనకు మద్దతివ్వాలని జగన్ను వ్యక్తిగతంగా కలిసి కోరినట్లు చెప్పారు. తాను ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేస్తున్నానని, గవర్నర్ కోటాలో ఎన్నికైనందున తాను స్వతంత్ర అభ్యర్థినేనని, తనకు మద్దతివ్వాలన్నారు. సీఎం చంద్రబాబు ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారని, ఒకవేళ పోటీ చేసినా గెలుపు తమదేనని చైతన్య రాజు అన్నారు.