రైలు ప్రమాదం: టీ మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు రద్దు
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు దుర్ఘటన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. గురువారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
అయితే వాటన్నింటినీ రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులను కోరారు. కేటీఆర్ జన్మదిన వేడుకల నిర్వహణ కోసం తెలంగాణ భవన్కు తరలివచ్చిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నేతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని, మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మూసాయిపేటలో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో సహాయ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలని, క్షతగాత్రులకు వైద్య సహాయం అందాలని, మృతుల కుటుంబాలకు అందాల్సిన సాయం వెంటనే అందేలా చూడాలని ఆయన గురువారం తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ, ఈ ప్రమాదంలో క్షతగాత్రులు సత్వరమే కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారని గురువారం ప్రధాని కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
రైలు ప్రమాదంపై చంద్రబాబు దిగ్ర్భాంతి
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లో గురువారం జరిగిన రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి శాంతిభవన్లో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు.. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు, స్కూల్ బస్సును ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడం విచారకరమన్నారు. మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పర్యటనలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాలేక పోయారు.