జగన్ దెబ్బకు సోనియా టి: పొన్నాలను ఏకేసిన కెటిఆర్
కాంగ్రెసు నేతలు దద్దమ్మలు కాకుంటే... ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచుతామని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పిస్తామని కరీంనగర్ సభకు వస్తున్న సోనియాతో చెప్పించాలని సవాల్ చేశారు. కాంగ్రెసు పార్టీ నయవంచన వల్లనే 1200 ఆత్మహత్యలు జరిగాయన్నారు. సోనియా 2004లో అదే కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని చెప్పారని, పదేళ్లు ఎందుకు పట్టిందన్నారు.
తెలంగాణ ఇచ్చేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి డబ్బులు తదితరాలు అడ్డు వచ్చాయా అని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలోనే, ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాలోనే పని చేయాలని సోనియాతో చెప్పించగలరా అన్నారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని పొన్నాల అనడం విడ్డూరమన్నారు. ఉద్యమం సమయంలో అమెరికాలో ఎవరు ఉన్నారో అందరికీ తెలుసునన్నారు.
ఎవరు తెలంగాణ ఉద్యమ నేతనో పొన్నాల స్వగ్రామం ఖిలాషాపురంలోనే చెప్పిస్తామన్నారు. ఓటర్లు పెద్దవాళ్లు అనుకుంటే కల్మషం లేని హైస్కూలు పిల్లలతోను చెప్పిస్తామన్నారు. టి కాంగ్రెసు నేతలు దద్దమ్మలు, చేతకాని అసమర్థులు కాకపోతే తెరాస డిమాండ్లన్నింటిని నెరవేర్చేవారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆలస్యంపై మొదట సోనియాతో క్షమాపణ చెప్పించాలన్నారు. తెలంగాణ తెచ్చింది.. ఇచ్చింది మేమే అంటూ కాంగ్రెసు నేతలు చెప్పడం విడ్డూరమన్నారు.
ఓ పెద్దాయన వల్ల (వైయస్ జగన్) సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకుపోతే విధిలేని పరిస్థితుల్లో తెలంగాణలోనైనా నాలుగు ఓట్ల కోసం సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. ఉద్యమం ఈ స్థాయికి రావడానికి కారణం కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతే తెలంగాణ ఇచ్చారన్నారు. పొన్నాల ఇంటిముందు ధర్నా చేసిన యాకూబ్ రెడ్డిని కొట్టించిందెవరన్నారు. తెలంగాణ ఇప్పుడే పుట్టిన బిడ్డవంటిదని దానిని ఐదేళ్ల పాటు బాగా చూసుకోవాల్సి ఉందన్నారు. అది తెరాసతోనే సాధ్యమన్నారు.
యూపిఏ గెలవదని సర్వేలు ఘోషిస్తున్నాయని, రాహుల్ గాంధీయే ఓడిపోతారని చెబుతున్నారని, అలాంటప్పుడు కాంగ్రెసు పార్టీకి ఎందుకు ఓటేయాలన్నారు. కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్లే అన్నారు. సోనియా దేవత కాదని బలిదేవత అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాక ఓటు అడగాలన్నారు. మునిగిపోతున్న కాంగ్రెసు నావకు ఓటు వేయవద్దన్నారు. కేసుల్లో ఇరుక్కున్నది కాంగ్రెసు నేతలా లేక తమ పార్టీ నేతలా చెప్పాలన్నారు. కెవిపితో లాబీయింగ్ చేసుకొని పొన్నాల పదవి తెచ్చుకున్నారని, దాని గురించి పూర్తిగా చెబితే పరువు పోతుందన్నారు.