'60 నెలల రికార్డు టైంలో హైద్రాబాద్ మెట్రో రైలు పూర్తి'
హైదరాబాద్: అరవై నెలల రికార్డు కాలంలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే లక్ష్యమని ఎల్ అండ్ టి మేనేజింగ్ డైరెక్టర్ విబి గాడ్గిల్ మంగళవారం అన్నారు. మెట్రో రైలులో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకునేలా ఎల్ అండ్ టి ఏర్పాట్లు చేస్తుందన్నారు.
నగరంలోని చర్లపల్లి పారిశ్రామికవేత్తల భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి గాడ్గిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో అవసరమయ్యే ఉత్పత్తులను స్థానిక ఎంఎస్ఎంఈ కంపెనీల నుంచి తీసుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలావరకు విదేశీ ఉత్పత్తులను వాడుతున్నట్టు తెలిపారు. విదేశీ ఉత్పత్తులకు దీటుగా స్వదేశీ ఉత్పత్తులను తయారు చేయాలని పారిశ్రామివేత్తలకు సూచించారు. త్వరలోనే ఎల్ అండ్ టి నుంచి సాంకేతిక బృందాన్ని చర్లపల్లి పారిశ్రామికవాడలకు పంపిస్తామని చెప్పారు. ఆ బృందం చర్లపల్లిలో తయారు చేసే ఉత్పత్తులను పరిశీలించి కంపెనీకి ఓ నివేదిక అందిస్తుందని తెలిపారు.