బాబుపై పోరు: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి ధర్నా
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారంనాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ధర్నాకు దిగారు. భారతరత్న అవార్డుకు ఎన్టీ రామారావు పేరును ప్రభుత్వం సిఫార్సు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆమె ధర్నా చేపట్టారు.
ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఇచ్చే పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారు, సమాజానికి ఆయా రంగాల్లో సేవలు చేసినవారి పేర్లను సిఫార్సు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డుల కోసం పలువురి పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు జాబితాను పంపించింది.
అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీ రామారావు పేరును భారతరత్న అవార్డు కోసం పంపించలేదని లక్ష్మీపార్వతి ఆరోపిస్తున్నారు. గతంలో కేంద్రంలో ఎన్డీయె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు భారత రత్న ఇచ్చేందుకు కేందర్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, అయితే చంద్రబాబు అందుకు చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారని అంటున్నారు.
ఎన్టీ రామారావుకు భారత రత్న ఇస్తే ఆ అవార్డును నిబంధనల మేరకు ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది. దానివల్లనే చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును భారతరత్న అవార్డుకు సిఫార్సు చేయలేదని విమర్శిస్తున్నారు.