ఒంటెద్దు పోకడలొద్దు: కెసిఆర్కు లక్ష్మణ్, క్లారిటీ కావాలని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఐదు సార్లు న్యాయస్థానాలు తలంటాయని చెప్పారు. ఇకనైనా కెసిఆర్ తన ఒంటెద్దు పోకడలను మానుకోవాలని సూచించారు.
బేషజాలకు, పంతాలకు పోకుండా స్థానికత అంశాన్ని రాజ్యాంగం సూచించిన ప్రకారం చూడాలని లక్ష్మణ్ అన్నారు. భారతీయులు దేశంలో ఎక్కడైనా నివసించే అధికారం, హక్కు కలిగి ఉంటారని ఆయన చెప్పారు. ఫాస్ట్ పథకానికి స్పష్టతనిచ్చి విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడకుండా చూడాలని ఆయన సిఎంను కోరారు.
ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి కూడా సిఎం కెసిఆర్పై మండిపడ్డారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను కోర్టులు తీవ్రంగా తప్పుబడుతున్నాయని అన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కెసిఆర్.. తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు.
అధికారం చేపట్టి మూడు నెలలైనా ఏ పథకాలను చేపట్టలేదని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఇప్పటికైనా సరైనా నిర్ణయాలు తీసుకోవాలని నర్సిరెడ్డి సూచించారు. కెసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలకు ఒరిగేదేమి లేదని అన్నారు.