గుణపాఠం నేర్చుకోండి: రైలు ప్రమాదంపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం స్పందించారు. ఆయన యశోద ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని అభిప్రాయపడ్డారు. పలువురు విద్యార్థులు చావుబతుకులతో పోరాడుతున్నారన్నారు. ఈ ఘటన నుండి ప్రభుత్వాలు పాఠం నేర్చుకోవాలన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పైన దృష్టి సారించాలన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గెయిల్, ఇప్పుడు తెలంగాణలో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలు వేయాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. బాధితులకు అందరు అండగా నిలబడాలన్నారు. పసివారి హృదయవిదారక యాతన చూస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. మరో 12గంటలు గడిస్తే కానీ క్షతగాత్రుల పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మృతుల సంఖ్య 17కు చేరుకుంది. రైలు బస్సును ఢీకొన్న ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. అనంతరం గురువారం సాయంత్రం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీ అనే విద్యార్థి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది.