చంద్రబాబుతో భేటీ: ఎమ్మెల్యే లింగారెడ్డి కన్నీటి పర్యంతం
విజయవాడ: తనకు కడప జిల్లా ప్రొద్దుటూరు శానససభా నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంపై సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు లింగారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన శనివారంనాడు విజయవాడలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తన భార్య లక్ష్మీప్రసన్నతో పాటు కలిశారు. చంద్రబాబు నుంచి ఆయనకు సానుకూలమైన ప్రతిస్పందన రాకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రొద్దుటూరు సీటును లింగారెడ్డిని కాదని వరదరాజులు రెడ్డికి ఇచ్చారు.
టిడిపి కార్యకర్తలను వేధించిన వరదరాజులు రెడ్డికి టికెట్ ఇచ్చారని లింగారెడ్డి విమర్శించారు. కడప జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డిని ఎదిరించి తాను విజయం సాధిచానని ఆయన అన్నారు. తనంతటి దురదృష్టవంతుడు మరెవరూ ఉండరని అన్నారు. టిడిపికోసం ప్రాణాలను ఫణంగా పెట్టానని ఆయన అన్నారు. కార్యకర్తలతో సమావేశమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటానని ఆయన చెప్పారు.
పార్టీని నుంచి పోలేడనే నమ్మకం కలిగించాను కాబట్టే తనకు ఈ దుస్థితి ఎదురైందని ఆయన ఆవేదన చెందారు. పార్టీలు భ్రష్టు పట్టాయని ఆయన అన్నారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో మాట్లాడిన విషయాలను తాను బయటకు చెప్పలేనని ఆయన అన్నారు.
తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని ఆయన అన్నారు. రాజకీయ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లింగారెడ్డి అన్నారు. అంతకు ముందు లింగారెడ్డి అనుచరులు చంద్రబాబు బసచేసిన హోటల్ వద్ద ధర్నాకు దిగారు.