వైఎస్ ఇలాకాలో లోకేష్: జగన్ రోడ్డుషోకు బస్సులు, సీజ్
కడప/అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం వైయస్ రాజశేఖర రెడ్డి ఇలాకా కడప జిల్లాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టిడిపి ఏం చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అదే చేస్తోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పాదయాత్ర చేస్తే.. జగన్ తన సోదరి షర్మిలచే పాదయాత్ర చేయించారని, తాము మేనిఫెస్టో విడుదల చేస్తే వారు విడుదల చేశారని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని టిడిపి చెబితే అదే మాటను వారు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యను తాము తీర్చుతామని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. కడప జిల్లా అభివృద్ధి బాధ్యత టిడిపిదే అన్నారు.
ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే టీడీపీని గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు. పదహారు నెలలు జైలులో ఉన్న వ్యక్తి కావాలా లేక నలభై ఏళ్ల రాజకీయ అనుభవం గల నేత కావాలా చెప్పాలన్నారు. కాగా, నారా లోకేష్ గురువారం తన తండ్రి తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు.
జగన్ రోడ్డుషోకు తరలిస్తున్న వాహనాలు సీజ్!
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారులు 20 వాహనాలను సీజ్ చేశారు. ఈ వాహనాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు జనాలను తరలించడానికి ఉపయోగిస్తున్నట్టు వాహన యజమానులు చెప్పినట్లుగా సమాచారం. దీంతో వాహనాలను అధికారులు సీజ్ చేశారు. జగన్ పెనుగొండలో ప్రచారం చేస్తున్నారు.