డూప్లికేట్: ప్రియుడు ఎస్సైగా, ప్రియురాలు ఐపీఎస్గా చీట్ చేశారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రేమికుల ఘరానా మోసం బయటపడింది. ప్రియుడి ఎస్సైగా, ప్రియురాలు ఐపీఎస్గా చెప్పుకుంటూ.. పలువురిని మోసం చేశారు. ప్రియుడి పేరు భరత్, ప్రియురాలి పేరు శ్రీలతగా తెలుస్తోంది.
వీరు తమ ఘరానా మోసానికి కమిషనరేట్నే అడ్డాగా చెప్పుకోవడం గమనార్హం. వీరు డూప్లికేటు అని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారి బండారం బయటపడింది.
భరత్ గతంలో ఓ బార్లో పని చేశాడు. అతను పోలీసు అధికారి కావాలని కలలు కన్నాడు. అనంతరం ప్రణాళికతో బార్లో ఉద్యోగం మానేశాడు. తన ప్రియురాలితో కలిసి నకిలీ గెటప్లతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు.
తనకు ఎస్సైగా సెలక్ట్ అయ్యానని, కమిషనరేట్లో మంచి పలుకుబడి ఉందని నిరుద్యోగులకు చెప్పేవాడు. ఉద్యోగం కోసం కొంత ఖర్చు అవుతుందని వారి వద్ద నుండి డబ్బు వసూలు చేసేవాడు. తనను కలవాలంటే పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి రావాలని చెప్పేవాడని తెలుస్తోంది.
ఉద్యోగం కోసం అతని వద్దకు నిరుద్యోగులు వస్తే.. వారికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేవాడు. ఆ తర్వాత విచారణ పేరిట అతని ప్రియురాలు శ్రీలత వారికి ఫోన్ చేసేది. ఆమె కూడా వారి నుండి కొంత డబ్బులు వసూలు చేసేదని తెలుస్తోంది. నిరుద్యోగులు అతని చుట్టు తిరిగారు. చాలా రోజులుగా ఉద్యోగాలు రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రియుడు, ప్రియురాలు బండారం బయటపడింది.