జగడం: మూడో భార్యను హత్య చేసిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: డబ్బు కోసం భార్యను చంపిన వ్యక్తిని హైదరాబాదులోని నాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డబ్బుల వ్యవహారమే ఈ హత్యకు దారి తీసింది. హత్య చేసిన ఆ వ్యక్తి ఇంట్లో చొరబడిన ఆగంతకులు హత్య చేశారని నాటకాలు ఆడాడు.
నల్లగొండ జిల్లా, మోత్కూరు మండలం దత్తప్పగూడెంకు చెందిన కంచర్ల యాదగిరిరెడ్డి (58) నాచారం లోని ఓ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ మల్లాపూర్, హెచ్సీఎల్ కాలనీలో నివసిస్తున్నాడు. యాదగిరిరెడ్డి 1979లో నల్లగొండకు చెందిన పద్మను వివాహం చేసుకోగా 1988లో క్యాన్సర్తో ఆమె చనిపోయింది. 1990లో అదే జిల్లాకు చెందిన ఊర్మిళను రెండో వివాహం చేసుకోగా 1999లో ఆమె యాదగిరిరెడ్డితో విడిపోయి మరో వివాహం చేసుకుంది.
ఈ నేపథ్యంలో యాదగిరిరెడ్డి అదే జిల్లా గొలనుకొండకు చెందిన సబితను 2000లో మూడో వివాహం చేసుకున్నాడు. ఈమె మోడీ అపార్ట్మెంట్లోని ప్లాట్లలో పాచిపనిచేస్తుంది. యాదగిరిరెడ్డి ఇంట్లో దాచిన రూ.25 వేలను సబిత తన తల్లిదండ్రులకు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న యాదగిరిరెడ్డి డబ్బు తిరిగి తీసుకురావల్సిందిగా భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీ రాత్రి యాదగిరిరెడ్డి భార్యకు ఊపిరాడకుండా చేసి చంపాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు ఇంట్లో చొరబడి భార్యను హత్య చేసినట్టుగా నమ్మించాలని ప్రయత్నించాడు. అయితే యాదగిరిరెడ్డిపై అనుమానంతో పోలీసులు ఈనెల 1న అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కేసును ఛేదించిన ఇన్స్స్పెక్టర్ ఎన్.అశోక్కుమార్, సిబ్బందిని ఏసీపీ చెన్నయ్య అభినందించారు.