పెళ్లి చేయలేదని అత్తపై దాడి: మరదలి చేయి నరికివేత
పోలీసుల కథనం ప్రకారం.. పొలారపు రమణ(50) అనే మహిళ తన కుమార్తె దేవి(19), వికలాంగుడైన కుమారుడు (16)తో కలిసి పెద్దాపురంలో నివాసం ఉంటోంది. రమణ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, గోకవరంలో నివాసం ఉంటున్న ఆమె సోదరుడు కేతా నాగేశ్వర్రావు కుమారుడు ఈశ్వర్రావు(23) కల్లుగీత కార్మికుడు. ఈశ్వర్రావు గత కొంతకాలంగా పెద్దాపురంలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
దేవిని తనకిచ్చి పెళ్లి చేయాలని మూడు రోజుల నుంచి మేనత్తను అడుగుతున్నాడు. మేనత్త ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఈశ్వర్రావు తన మేనత్తపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కల్లుగీసే కత్తితో మేనత్త ఇంటికి వచ్చిన ఈశ్వర్రావు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
తన తల్లిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దేవిపై కూడా ఈశ్వర్రావు దాడికి దిగాడు. ఆమె కుడి అరచేయిని నరికివేశాడు. దీంతో ఆమె కుడి అరచేయి తెగి పడింది. అనంతరం నిందితుడు ఈశ్వర్రావు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే తల్లీ కుమార్తెలను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవి పరిస్థితి నిలకడగా ఉండగా, ఆమె తల్లి రమణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.