భార్య, కూతురితో అసభ్యంగా: స్నేహితుడి హత్య
హైదరాబాద్: స్నేహితుని భార్య, కుమార్తెల గురించి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిని స్నేహితులంతా కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. స్నేహితుని ప్రవర్తన నచ్చక పోవడం వల్లే హత్య జరిగిందని బంజారాహిల్స్ ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 17న గుర్తుపట్టని విధంగా కాలిపోయి లభ్యమైన శవాన్ని స్వాధీనం చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు వారం రోజుల్లోపే నిందితులను అరెస్టు చేశారు.
మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి కేసు వివరాలను వెల్లడించారు. బార్కాస్కు చెందిన మృతుడు మహ్మద్ అహ్మద్ఖాన్, సయ్యాద్ గౌస్ స్నేహితులు. ఈ క్రమంలో అహ్మద్.. సయ్యద్ భార్య, కూతురిపై కన్నేశాడు.
పలుమార్లు ఈ విషయంపై హెచ్చరించినా వినిపించుకోకుండా అదే తరహాలో వ్యవహరిస్తుండటంతో పక్కా ప్రణాళిక ప్రకారం గౌస్ స్నేహితులైన మరో ముగ్గురి సహాయంతో అహ్మద్కు బాగా మద్యం తాగించి బంజారాహిల్స్లోని ఓ ఖాళీ ప్లాట్ వద్దకు తీసుకువచ్చి బండరాయితో మోది హత్యచేశారు. అనంతరం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు సమీపంలో ఉన్న చెత్తను మృతదేహంపై వేసి మంటపెట్టి వెళ్లిపోయినట్లు పోలీసులకు నిందితులు వివరించారు.
కాగా ఈ నెల 17న పూర్తిగా కాలి ఉన్న మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దానిని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. అది బార్కాస్కు చెందిన అహ్మద్గా గుర్తించిన పోలీసుల ఆ దిశగా విచారణ జరపగా నిందితులు అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో వారిని రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళపై బ్లేడుతో దాడిచేసిన ఆటో డ్రైవర్
తనను ప్రేమించలేదన్న కక్షతో ఓ యువతిపై ఆటోడ్రైవర్ నాగరాజు బ్లేడుతో దాడిచేసి గాయపరచిన సంఘటన మంగళవారం తిరుపతి మంగళం ప్రాంతంలో జరిగింది. యువతి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి ఆటో డ్రైవర్ను అతని మిత్ర బృందానికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
తిరుపతి నగరం మంగళం ప్రాంతంలో నివస్తున్న 22 ఏళ్ల యువతి డిగ్రీ పూర్తి చేసుకుని తండ్రికి తోడుగా ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్న జీవిస్తోంది. యువతి ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకుని ఆటో డ్రైవర్ నాగరాజు మరో నలుగురు సహచరులతో కలసి యువతి ఇంటి లోపలికి ప్రవేశించాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. ఆమె ససేమిరా అనడంతో ప్రేమించపోతే చంపేస్తానంటూ తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ యువతిపై దాడి చేశాడు.
భీతిల్లిన ఆ యువతి ప్రాణాలు కాపాడుకోవడానికి తన చేతిని అడ్డంగా పెట్టింది. దీంతో ఆ యువతి కుడిచేతిపై గాయాలయ్యాయి. యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నాగరాజును, అతని స్నేహితులకు పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని పట్టించారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.