పోలవరం ట్విస్ట్: ఏపీ వద్దు.. టీలోనే ఉంటాం, కావాలంటే!
ఖమ్మం/హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తున్న నేపథ్యంలో పలువురు ముంపు గ్రామాల ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లనున్నారు. అయితే, ఇందులో పలువురు ఉద్యోగులు ఏపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదట.
తాము తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటామని ప్రభుత్వాన్ని కోరుతున్నారట. తమను ఖమ్మంలోనే ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారట. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలవడం, తమను ఏపీకి పంపిస్తున్న నేపథ్యంలో.. తమ అంశాన్ని ప్రత్యేకంగా కమల్నాథ్ కమిటీకి ఇవ్వాలని సూచిస్తున్నారట. తమ అభిప్రాయాలను తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నారట.
ముంపు గ్రామాల ఉద్యోగులు ఏపీలోకి వెళ్లనున్న నేపథ్యంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముంపు మండలాలకు చెందిన వందలాది మంది ఉద్యోగులు ఏపీలోకి వెళ్లాల్సి ఉంటుంది. చాలామంది అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదట.