రౌడీలతో దాడులు, ఒకే గదిలో విద్యార్థులు, రంగంలోకి..
హైదరాబాద్/ఇంపాల్: మణిపూర్ రాష్ట్రంలోని ఎన్ఐటీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్థానిక విద్యార్థులు దాడులు చేస్తుంటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విషయం తెలిసిందే. స్థానిక విద్యార్థులు రౌడీలతో దాడులు చేయంచడంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు రోజుల నుంచి తమపై దాడులు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వాలు ఆదుకోవాలని విద్యార్థులు డిమాండ్ కాలేజీలో లోకల్, నాన్ లోకల్ విషయంలో విద్యార్థుల మద్య గొడవ జరిగింది. శనివారం రాత్రి భోజనాల సమయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో మణిపూర్ ఎన్ఐటీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో తెలుగు విద్యార్థులంతా ఒకే గదిలో తలదాచుకున్నట్లుగా సమాచారం.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. స్వయంగా మణిపూర్ రాష్ట్ర డీజీపీ షాహీద్ క్యాంపస్కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు, ఈ గొడవ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు మణిపూర్ ప్రభుత్వానికి అధికారులతో మాట్లాడారు.
ఏపీ అదనపు డీజీపీ అర్పీ ఠాకూర్, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మలు మణిపూర్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్తో మాట్లాడటం కూడా సంఘటన పైన దృష్టి సారించారు. కళాశాలను మణిపూర్ సీఎం కూడా సందర్శించారు. తెలుగు విద్యార్థులకు భరోసా ఇచ్చారు. జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మణిపూర్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులపై మణిపూర్ స్థానిక విద్యార్థులు చేసిన దాడుల విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ అప్రమత్తమయ్యింది. మణిపూర్ నిట్ క్యాంపస్ చుట్టూ సీఆర్ పిఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరించింది.
అలాగే, సంఘటన గురించి తెలిసిన వెంటనే నిట్ క్యాంపస్కు మణిపూర్ సీఎం హుటాహుటిన చేరుకున్నారు. దీనికి బాధ్యులైన విద్యార్థులను క్యాంపస్ నుంచి బహిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారని దీని వల్ల మణిపూర్ ఇమేజ్ దేశవ్యాప్తంగా డ్యామేజ్ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.