తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు: రాకపోకలు బంద్
హైదరాబాద్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను పలు ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయి. ఒడిశా నుండి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ధ్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
రాగల ఇరవై నాలుగు గంటలలోను తెలంగాణ, కోస్తాంధ్రల్లో పలుచోట్ల వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
కాగా, రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో ఏపీలో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు వస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో విద్యుత్ పోయి అంధకారం నెలకొంది.
కోస్తా తీరం వెంబటి గంటకు నలభై నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ కోరావుట్ మార్గంలో జెర్సీ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
రాజమండ్రిలో రాకపోలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తారు. దిగువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పది గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.