బ్యాన్పై మావోలు: ఏబీఎన్, టీవీ9లకు జగన్ మద్దతు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్ల ప్రసారాల నిలిపివేతను మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మీడియాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియంతృత్వ ధోరణితో మాట్లాడటం సరికాదని, వాటిని తాము ఖండిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎమ్మెస్వోల వెనుక ఉండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్ల ప్రసారాలను కేసీఆర్ ఆపివేయించారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఈ చర్య కేసీఆర్ నియంతృత్వ లక్షణాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదని జగన్ అభిప్రాయపడ్డారు.
దళితులను ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణకు కావలి కుక్కలా ఉంటానన్న కేసీఆర్ మాట మార్చారని మండిపడ్డారు. ఆరో వేలులాంటి పనికిరాని ఉప ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇచ్చారని జగన్ ధ్వజమెత్తారు.
నక్సల్ ఎజెండా అని చెప్పి అధికారంలోకి వచ్చాక గ్రేహౌండ్స్తో అణచితేవకు దిగారన్నారు. బహుళజాతి కంపెనీలకు కేసీఆర్ దాసోహమయ్యారన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలో కౌంటర్ దళిత ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, ప్రశ్నించే శక్తులన్నింటినీ ప్రలోభాలకు లొంగదీసుకున్నారని విమర్శించారు.