జగన్పై రేవంత్ ఆగ్రహం, కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలని..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం నిప్పులు చెరిగారు. జగన్, కేసీఆర్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు.
తెలంగాణలో సమస్యల పైన వైయస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని చెప్పారు. తెలంగాణలో సమస్యలను జగన్ ప్రస్తావించక పోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగన్, కేసీఆర్ల మధ్య అవగాహన ఉన్నందువల్లే ఆయన స్పందించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్.. వైయస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. బడుగు, బలహీన వర్గాల వారికి ఉద్యోగాల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం జరిగితే విద్యార్థులు నష్టపోతారన్నారు. గతంలో పలువురు వయసు సడలింపు కోసం కేసీఆర్కు విజ్ఞప్తులు చేశారన్నారు.
కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని, కానీ బడుగు, బలహీన వర్గాల వారిని పట్టించుకోవాలన్నారు. కేసీఆర్ సీఎం కాగా, ఆయన తనయుడు కేటీఆర్ ఐటీ మంత్రి అని, అల్లుడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి అని, కూతురు కవిత ఎంపీ అని.. ఇలా ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
1956కు ముందు నిబంధన అని చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ ప్రజలు తాము ఇక్కడే ఉంటున్నట్లు ఆధారాలు ఎలా తీసుకు రాగలరని ప్రశ్నించారు. భారత్, పాకిస్తాన్ విభజన సమయంలోను ఇలా నిబంధనలు లేవని విమర్శించారు.
మెదక్ జిల్లాలో అంత పెద్ద ప్రమాదం జరిగితే వెళ్లేంత సమయం కూడా కేసీఆర్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పైన స్పందించరా అన్నారు. సిమెంట్ ధరల పెంపు అన్యాయమని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. వైయస్ రాసిన దోపిడీ గ్రంథాన్ని జగన్, కేసీఆర్ చదువుతున్నారన్నారు. గోదాముల పైన దాడులు చేసి అక్రమ నిల్వలను వెలికి తియాలని డిమాండ్ చేశారు.