మథిర: మోత్కుపల్లికి అగ్నిపరీక్ష, భట్టికి ప్రతిష్టాత్మకం
ఖమ్మం: నియోజకవర్గం మారిన నల్లగొండ జిల్లా నేత మోత్కుపల్లి నర్సింహులుకు మథిర శాసనసభా నియోజకవర్గం అగ్నిపరీక్ష కానుంది. ఆయన నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి మారి మథిర నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిస్తేనే మోత్కుపల్లి నర్సింహులుకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత స్థానం నిలబడుతుంది. లేదంటే ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో 60 శాతం మంది సీమాంద్రులే. మాదిగ సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించేది వారే. ఇప్పుడు ఇక్కడ ముక్కోణపు పోటీ జరుగుతోంది కాంగ్రెస్, సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క బరిలో ఉన్నారు. శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్కకు విజయం ప్రతిష్టాత్మకం.
మాదిగలు ఎక్కువగా ఉండడం, సరైన స్థానిక అభ్యర్థి కానరాకపోవడంతో తెలుగుదేశం పార్టీ మోత్కుపల్లిని రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా కేవలం 1417 ఓట్ల తేడాతో ఓటమి పాలైన కమల్ రాజు ఈసారి సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఐదుసార్లు సిపిఎం గెలిచింది. కాంగ్రెస్ ఎనిమిదిసార్లు, టిడిపి ఒక్కసారి విజయం సాధించాయి. ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం మధ్యనే పోటీ ఉంటూ వచ్చింది.ఇప్పుడు ముక్కోణపు పోటీ హోరాహోరీగా సాగుతోంది. అయితే, సిపిఐ కాంగ్రెసుతో జత కట్టడం సిపిఎంకు అవరోధంగానే మారింది.
కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క అభివృద్ధి మంత్రంతో ఎన్నికల బరిలోకి దిగారు. నియోజక వర్గానికి చేసిన పనులే తనను రెండోసారి గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన భట్టి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
గతంలో ఎప్పుడూ సిపిఎంకు మద్దతు ఇస్తూ వచ్చిన టిడిపి ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి సొంతంగా పోటీకి దిగుతోంది. రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతగా ఉన్న మోత్కుపల్లి బరిలో ఉండడం కలిసి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది.