మెదక్ జిల్లా: హేమాహేమీల మధ్య టగ్ ఆఫ్ వార్
సంగారెడ్డి: మెదక్ జిల్లా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా తన దృష్టిని ఆకర్షించనుంది. ఈ జిల్లా నుంచి హేమాహేమీలు ఇటు శాసనసభకు, అటు లోకసభకు పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్లమెంటుకూ, శాసనసభకూ ఇదే జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్ నుంచి పోటీ చేస్తుండగా, ఆయనపై గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు బాబూ మోహన్ ఈసారి తెరాస అభ్యర్థిగా పోటీకి దిగారు.
మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మెదక్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రులు జె. గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి కాంగ్రెసు నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. తెరాసలో కీలక నేతగా మారిన హరీష్ రావు సిద్దిపేట శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ అసెంబ్లీ నుంచి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మాజీ మంత్రి, ఎఐసిసిలో మంచి గుర్తింపువున్న జె.గీతారెడ్డి సర్వం సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మరోమాజీ మంత్రి ఫరీదోద్దీన్ అలకపాన్పునెక్కి కూర్చోవడంతో గీతారెడ్డికి కాస్తా తలనొప్పి కలిగించే అంశమే.
సంగారెడ్డి నుంచి ముచ్చటగా మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే తూర్పు జయ ప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న చింత ప్రభాకర్తో మరోమారు ఢీకొనడానికి సిద్ధమవుతున్నారు. పటన్చెరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ గెలుపే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అయితే అంతర్గతంగా డిసిసి అధ్యక్షుడు భూపాల్రెడ్డి వర్గంతో సఖ్యత లేకపోవడంతో నందీశ్వర్గౌడ్ ఏ మేరకు రాణిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
నర్సాపూర్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న మాజీ మంత్రి సునితారెడ్డికి ఈసారి చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన సిపిఐ పోటీలో లేకపోవడంతో ఊరట పొందుతున్నారు. మెదక్ శాసనసభా నియోజకవర్గం నుంచి సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా ఇదే నియోజకవర్గం నుంచి తెలంగాణ మాస్ మహారాణిగా పిలుచుకునే పద్మా దేవేందర్రెడ్డి (పద్మక్క) పర్పస్పరం ఢీకొననున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో క్రితంసారి మాదిరిగానే చతుర్ముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, తెరాస, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థులు రంగంలో ఉండడంతో ప్రచారం హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దుబ్బాక నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్, తెరాస మధ్యకు భారతీయ జనతా పార్టీ చోచ్చుకుని వచ్చింది.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా కెసిఆర్ రంగంలోకి దిగడం, సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డితో పాటు టిడిపి అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి మధ్య పోటీ ఆసక్తికరంగా కొనసాగనుంది. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఈసారి రసవత్తర పోరు నెలకొననుంది. మొత్తం మీద, మెదక్ జిల్లా ఈసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది.