మెదక్: చింతకమడకలో ఓటేసిన కెసిఆర్ దంపతులు
మెదక్: మెదక్ లోకసభ స్థానంలో శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, తన సతీమణితో కలిసి సిద్ధిపేట మండలం చింతకమడకలో ఓటు వేశారు. కెసిఆర్ దంపతులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్వాతం చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెసు అభ్యర్థి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి శివంపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కోనాపూర్లో ఓటేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పోతారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటాన్చెరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో స్థానిక శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి ఓటు వేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి 60 వేల నుంచి 70వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓటు హక్కు చాలా విలువైందని, ఓటు ద్వారానే లక్ష్యాలు నెరవేర్చుకోగలమని ఆయన అన్నారు.
సిద్ధిపేట మార్కెట్ యార్డులోని పోలింగ్ కేంద్రం, భరత్నగర్లోని పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. చిన్న శంకరంపేట మండలం చందాపూర్లో ఈవిఎం మొరాయించింది. పనిచేయని ఈవిఎం స్థానంలో కొత్త ఈవిఎం ఏర్పాటు చేశారు.
మెదక్ లోకసభ స్థానం పరిధిలోని పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వెల్, నర్సాపూర్, మెదక్, సిద్ధిపేట శానససభా నియోజకవర్గాలకు చెందిన 15 లక్షల 43 వేల 422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సాగుతుంది.