సభ్యత్వం: చిరుకి ఫ్యాన్స్ షాక్: పవన్ స్పీచ్పై జయసుధ
హైదరాబాద్/విశాఖ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షులు చిరంజీవికి ఆయన అభిమానులు షాక్ ఇచ్చారు! విశాఖలో పలువురు మెగా అభిమానులు ఆన్ లైన్ విధానంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వారు సభ్యత్వ నమోదు పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ విధానంలో వ్యక్తిగత నమోదు ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడే వారి కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెసు పార్టీ బస్సుయాత్రను బహిష్కరిస్తున్నట్లు మెగా అభిమానులు చెబుతున్నారు.
పవన్ స్పీచ్ పైన జయసుధ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్టైల్కు తగ్గట్లు మాట్లాడారని సికింద్రాబాద్ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ అన్నారు. పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చునని, అయితే ఆ పార్టీని నిలుపుకోవడం గొప్పతనమన్నారు. పవన్ ప్రసంగాన్ని తాను టీవిలలో చూడలేదని, పత్రికలలో మాత్రం చదివానని తెలిపారు. పవన్ పార్టీని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఆయన తన స్టైల్కు తగినట్లు మాట్లాడారన్నారు. ఏ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందో దానికే ఓటు వేయాలని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎక్కడి నుండి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. నటిగా కొనసాగుతున్నప్పటికీ రెండింటికి న్యాయం చేయగలనని చెప్పారు.