ఆందోళనలో ఉన్నారు,మీరే చెప్పాలి: మోడీకి జగన్ ఎంపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న వార్తలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాన మంత్రే స్వయంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు గత యూపిఏ ప్రభుత్వం, తాజా ఎన్డీయే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రణాళికా సంఘం మాత్రం ప్రత్యేక హోదా అర్హత ఎపి సాధించలేదని నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేకపాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అపోహలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మరోసారి తెరదించే ప్రయత్నం చేశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిర్ణయాన్ని గత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, దానికి బిజెపి కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక హోదా కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం పెద్ద పీట వేయనుందని చెప్పారు.