జగన్పై సబ్బం విషం కక్కుతున్నారు: మేకపాటి ఫైర్
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి విషం కక్కుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్ట పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సబ్బం హరి వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఓడిపోతారని గతంలో పలు సర్వేలు చెప్పాయని, కానీ వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు రాజకీయ క్రీడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరగదనే నమ్మకంతో తాము ఉన్నామని ఆయన చెప్పారు. విభజన జరగదనే నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైయస్ జగన్ అనే ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు మూడుసార్లు రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నితీష్ కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, జయలలిత, కరుణానిది, శరద్ పవార్, ప్రకాష్ సింగ్ బాదల్ సహా పలువురు నేతలను జగన్ కలిశారని ఆయన గుర్తు చేశారు.
జగన్ను లక్ష్యం చేసుకుని విభజన ప్రక్రియను చేపట్టారని ఆయన విమర్శించారు. జగన్కు రాజకీయంగా ప్రతిబంధకాలు సృష్టించడానికే కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోందని మేకపాటి విమర్శించారు విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆ లేఖను వెనక్కి తీసుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనసా వాచా కోరుకునే వ్యక్తి జగన్ అని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో ఆర్టికల్ 3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పలు పార్టీలు అంటున్నాయని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేత కొత్త పార్టీ పెట్టించే యోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.