తెరాస విలీనం పుకార్లే: ఈటెల, ఎమ్మెల్యేపై 'టి' ఫిర్యాదు
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో తమ పార్టీ విలీనమవుతుందనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ స్పందించారు. కాంగ్రెసు పార్టీలో తెరాస విలీనమవుతుందని మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహగానాలు మాత్రమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు రాజకీయంగా కాంగ్రెసుతో ఏ విధమైన చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి తిరిగి వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రేపు (గురువారం) తమ పార్టీ శాసనసభ్యులమంతా ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లులో లోపాలున్నాయని, మద్దతు ఇవ్వలేమని బిజెపి వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు. బిల్లులో లోపాలుంటే ప్రస్తుత ఆధునిక యుగంలో సరిచేయడానికి ఓ గంట సమయం చాలునని ఆయన అన్నారు.
పార్టీ ఎన్నికల ప్రణాళికలో, బహిరంగ వేదికలపైనా, పార్లమెంటులో సుష్మా స్వరాజ్ వంటి బిజెపి నేతలు తెలంగాణకు మద్దతిస్తామని చెప్పారని, ఈ దశలో తెలంగాణపై బిజెపి వెనక్కి తగ్గుతుందని తాము భావించడం లేదని ఆయన అన్నారు.
టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డిపై ఫిర్యాదు
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లింగా రెడ్డి పైన తెలంగాణ ప్రాంత న్యాయవాదులు సైఫాబాద్ పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. పార్లమెంటును తగులబెట్టి అయినా విభజనను ఆపుతామన్న లింగారెడ్డి వ్యాఖ్యలపై వారు ఫిర్యాదు చేశారు.