బెజవాడ వద్దనలేదు: రాజధానిపై మంత్రి, బాబుపై భారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రానికి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చింది పూర్తిస్థాయి నివేదిక కాదని, దానికి కొనసాగింపుగా మరో నివేదిక ఇవాళ ఇవ్వనుందని ఏపీ మంత్రి పీ నారాయణ గురువారం అన్నారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడా చెప్పలేదన్నారు. అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలపై వచ్చే సోమవారం కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.
రైతాంగానికి నష్టం జరగకుండా కమిటీ సూచనలు చేసిందన్నారు. దేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాల రాజధానులను సెప్టెంబర్ 10 తర్వాత కమిటీ పరిశీలిస్తుందన్నారు. సెప్టెంబర్ 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని ఎక్కడ అనే దాని పైన ఓ స్పష్టత రావొచ్చని చెప్పారు. రాజధాని అవసరాల కోసం వ్యవసాయ భూములు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని ఉండే అవకాశం ఉందని ఇంతకు ముందే ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, శివరామకృష్ణ కమిటీ సూచలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. కమిటీపై మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందని లేని పక్షంలో అనేక అభిప్రాయాలతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
రాజధానిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకే కమిటీ ఏర్పాటు అయిందని, ఏపీ రాజధానిని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ పైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాజధాని అడవిలోనా అన్నారు.. కాగా, రాజధాని పైన తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు.