మోడీ శత్రువు, చంద్రబాబు అరెస్ట్ చేస్తానన్నారు: కెసిఆర్
నల్గొండ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణ శత్రువు అని, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్నే ఆయన చదువుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. బుధవారం నల్గొండ జిల్లాలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబు దొంగ కాపలా కాస్తున్నారన్నారు.
సెటిలర్లకు కష్టమొస్తే తనకు వచ్చినట్టు కాదా?, తనకు కష్టమొస్తే సెటిలర్లకు వచ్చినట్టు కాదా?, వారంతా తెలంగాణ బిడ్డలేనని కెసిఆర్ అన్నారు. తనది హక్కుల కోసం పంచాయతీ తప్ప ఎవరిపైనో కక్ష సాధింపు కాదన్నారు. తాను సెటిలర్లు అంటే తప్పు పడతారని, తాను సెటిలర్లను ఏమీ అనలేదన్నారు. సెటిలర్లంతా తెలంగాణ బిడ్డలేనన్నారు. దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు దొంగ డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
సమైక్యాంధ్ర నేతల కుట్రలు, కుతంత్రాల నుంచి బయటపడాలంటే తెలంగాణలో సమర్థ నాయకత్వం అవసరమని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తుంటే ఆనాటి టి కాంగ్రెస్ మంత్రులు పొన్నాల, జానా తమపై కేసులు పెట్టి జైలులో వేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించానన్న తృప్తి తనకు వెయ్యి జన్మలకు ఉంటుందన్నారు. ఏ పదవులూ అవసరం లేదన్నారు. ఏ పదవైనా వెంట్రుక, ఈకతో సమానమని చెప్పారు.
సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ సన్నాసులకు అప్పగిస్తే సర్వనాశనం చేస్తారని, అందుకే ఆరునూరైనా తెరాసను ఎన్నికల్లో నిలబెట్టాలని తెలంగాణ సమాజం ఒత్తిడి తీసుకరావడంతో ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు నయవంచకుడు, రంగులు మార్చే ఊసరవెల్లి అని దుయ్యబట్టారు.
ఆయన సిఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలకు నరేంద్ర మోడీ వస్తానంటే అరెస్టు చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు మోడీ సంకనాకుతున్నాడన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే ఏదీ ముడిపడదన్నారు. బిజెపికి ఓటు వేస్తే అది చంద్రబాబుకే పోతుందన్నారు. మోడీ రెండు పక్కలా ఆంధ్రోళ్లను పెట్టుకొని మాట్లాడటం దేనికి సంకేతమన్నారు.