23 నుండి టిలో మోడీ, పవన్: పవన్ వచ్చాక షెడ్యూల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీ నుండి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, మోడీతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం చెప్పారు.
23 నుండి తెలంగాణ జిల్లాల్లో మోడీ పర్యటిస్తారన్నారు. మోడీతో పాటు పవన్, తమ పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రచారంలో పాల్గొంటారన్నారు.
హైదరాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ సభలలో మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఉంటుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లలో జరిగే సభలలోను మోడీతో పవన్, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పాల్గొంటారు.
మే 1 నుంచి సీమాంధ్రలో మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, అనంతపురం, తిరుపతి, నర్సాపురం, విశాఖలో బహిరంగ సభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిజెపి తరపున ప్రచారం నిమిత్తం కర్నాటకు వెళ్లిన పవన్ తిరిగి వచ్చిన తర్వాత ఇరు ప్రాంతాల్లో పర్యటనపై షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రేపు సోనియా ప్రచారం
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రేపు తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లా బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు.