ఎన్ కన్వెన్షన్ ఇష్యూ: హీరో నాగార్జునకు నోటీసులు
హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జునకు అధికారులు నోటీసులు జారీ చేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్ నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ విషయంలో నోటీసులు జారీ చేశారు. హైదరాబాదులోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువును ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కోసం ఆక్రమించారంటూ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
ఆ నేపథ్యంలోనే విద్యాసాగర్ నాగార్జునకు ఆ నోటీసులు జారీ చేశారు. గతంలో అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు పూనుకోవడంతో యజమాని నాగార్జున తనకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈ నెల 26వ తేదీన మరో మారు తుమ్మిడికుంట చెరువును సర్వే చేయనున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. సర్వే చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడి కుంట చెరువు పూర్తి నీటిమట్టం బఫర్ జోన్లో నిర్మించారా, లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుంటామని చెప్పారు.
నాగార్జునతో పాటు సంబంధిత భూములకు చెందిన ఇతరులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు విద్యాసాగర్ తెలిపారు.