ఫోటో: తుమ్మలపై ఫ్లెక్సీ, నామా స్పందన, బొత్స సెటైర్
ఖమ్మం/హైదరాబాద్/విజయవాడ: పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీ మారుతున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటైన నేపథ్యంలో ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు బుధవారం స్పందించారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు.
జిల్లాలో టీడీపీ పెట్టినప్పటి నుండి పార్టీ బలంగా ఉందని, సాధారణ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో టీడీపీ విజయం సాధఇంచిందన్నారు. టీడీపీ ఖమ్మం నగర నాయకులు మాట్లాడుతూ.. తుమ్మలకు పార్టీ ఎన్నో ఇచ్చిందని, ఈ రోజు పార్టీని వీడి వెళ్లడం సరికాదన్నారు.
చీఫ్ విప్ ఛాంబర్ కేటాయించండి: టీటీడీపీ లేఖ
అసెంబ్లీలో తమకు కార్యాలయం కేటాయించాలని కోరుతూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. చీఫ్ విప్కు కేటాయించిన ఛాంబర్ను తమకు ఇవ్వాలని లేఖలో కోరారు. అంతేకాకుండా చీఫ్ విప్ ఛాంబర్ను ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నాగేశ్వర రావు పరిశీలించారు.
చంద్రబాబు వచ్చాక జాబులు పోయాయి: బొత్స
కృష్ణా జిల్లాలోని నందిగామ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా బి బాబురావును పోటీలో నిలబెడుతున్నట్లు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం చెప్పారు. ప్రజల తరఫున ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకే తమ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని కానీ, బాబు వచ్చిన తర్వాత జాబులు పోయాయని ఎద్దేవా చేశారు.