చిరు పేలని తుపాకీ అని తెలియగానే: రాధాకృష్ణపై నమస్తే తెలంగాణ నిప్పులు
హైదరాబాద్: 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ పైన 'నమస్తే తెలంగాణ' సోమవారం నాటి తన సంచికలో తీవ్రస్థాయిలో మండిపడింది. కేసీఆర్ ఏం చేసినా తప్పే, చంద్రబాబు ఏం చేసినా రాధాకృష్ణకు ఒప్పే కనిపిస్తుంటుందని దుయ్యబట్టింది. అవకాశవాదం విషయంలో రాధాకృష్ణ ముందు చంద్రబాబు కూడా పనికిరారని పేర్కొంది.
పత్రికలో రాయడం, వారిని లొంగదీసుకొని పనులు చేయించుకోవడం రాధాకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించింది. ఆయనకు నాయకులు, రాజకీయాలు, పార్టీలు శాశ్వతం కాదని పేర్కొంది.
చంద్రబాబు పనికిరాడు, ఇక లేవడు అనుకొని చిరంజీవిని, ఆయన పార్టీని ఎత్తుకున్నాడని, చిరంజీవి పేలని తుపాకీ అని తేలగానే మళ్లీ చంద్రబాబును అందుకున్నారని, తీరా 2009 ఎన్నికలు సమీపించే సమయానికి రాజశేఖర రెడ్డిపై తన పత్రికలో మూగనోము పాటించారని ఆరోపించారు.
అలాంటి వ్యక్తి కేసీఆర్ను అవకాశవాది అని తిడతారని, ఆయనకు తనకు తానే గొప్ప వ్యక్తిలా అనుకుంటారని, ఆయన డిట్టో చంద్రబాబు అని మండిపడింది. చంద్రబాబులాగే ఆలోచిస్తారని, ఆయనలాగే చూస్తారని, ఆయనలాగే మాట్లాడుతారని, తెలంగాణకు ఇంకా చంద్రబాబుల అవసరం లేదని పేర్కొంది.
రాధాకృష్ణ నీతులు చెబుతుంటే గంపెడు చేపలి మింగిని పిల్లి శ్రీరంగ నీతులు చెబుతున్నట్లుగా ఉందని పేర్కొంది. రాధాకృష్ణకు సెలక్టివ్ అమ్నీషియా జబ్బు ఉందని ధ్వజమెత్తింది.
ఎవరు ఏం చేశారన్న దానితో నిమిత్తం లేకుండా ఆయనకు కేసీఆర్ ఒక పిడకలలాగా కనిపిస్తారని, చంద్రబాబు చల్లని చంద్రునిల కనిపిస్తారన్నారు. కేసీఆర్ ప్రతిపక్షం అన్నది ఉండకూడదనుకుంటున్నాడని ఆయన పేర్కొనడాన్ని ప్రశ్నించింది. చంద్రబాబు ఏపీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.