హల్చల్: కుప్పంలో అల్లుడు, హిందూపురంలో మామ
అనంతపురం/ చిత్తూరు: అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రచారం ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఉదయం మాయసముద్రం, మలూగరలో నిర్వహించిన రోడ్షోలో బాలయ్య ప్రసంగించారు. కాంగ్రెస్ది అవితీనివాదం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీది అరాచకవాదం అని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని బాలయ్య స్పష్టం అన్నారు. తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందూపురంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలకృష్ణ అన్నారు.
ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం చంద్రబాబు తరపున నామినేషన్ వేసేందుకు కుప్పంలో లోకేష్ భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు లక్ష్మిపురం వరదరాజస్వామి ఆలయంలో లోకేష్ పూజలు జరిపారు.
అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా కుప్పం గురించే చంద్రబాబు ఆలోచిస్తుంటారని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే కుప్పంలో ఐటీ పార్కు నిర్మిస్తామని లోకేష్ తెలిపారు. హైదరాబాద్ను నిర్మించడానికి నిజాంకు వందేళ్లు పడితే సైబరాబాద్ను తొమ్మిదేళ్లలో నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ పైలుపైనే తొలి సంతకం చేస్తారని ఆయన తెలిపారు.
డ్వ్రాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ సుజల పేరుతో రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కుప్పంలో తాగునీటి సమస్య ఉండదని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యకార్డులు అందజేస్తామన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.