లోకేష్ ప్లాన్: తెరాసకు ధీటుగా తెలంగాణలో టిడిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ధీటుగా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెసు అంత బలంగా లేకపోవడంతో తమ పార్టీ పుంజుకోవడానికి తగిన వ్యూహరచన చేస్తున్నారు.
తెలంగాణకు చెందిన పార్టీ నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇందుకుగాను ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనులు ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పార్టీ కార్యాలయంలో మకాం వేస్తున్నారు. వివిధ పనుల కోసం వస్తున్న కార్యకర్తలు, నాయకులను ఆయన కలుస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో పార్టీ కార్యక్రమాలపై లోకేష్ దృష్టి సారించారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న అంశంపై ఆయన దృష్టి సారించారు. తెలంగాణలోని ముఖ్యమైన నేతలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. తెలుగునాడు విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయడంపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. యువతను, విద్యార్థులను పార్టీ వైపు తిప్పుకోవడం ద్వారా మాత్రమే తగిన సత్తా చాటగలమని ఆయన భావిస్తున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నారా లోకేష్కు కార్యాలయం సిద్ధమవుతోంది. ఎన్నికల తరువాత రోజు పార్టీ కార్యాలయానికి వస్తున్న లోకేష్ తన కోసం తాజాగా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయంలోని రెండో అంతస్థులో చంద్రబాబు నాయుడు ఛాంబర్కు ఎదురుగా లోకేష్కు గది కేటాయించారు. గతంలో ఈ గదిని తెలుగుదేశం నేత నామా నాగేశ్వరరావుకు కేటాయించారు.