జగన్ సంతకంపై నారా లోకేష్ సెటైర్, పాట పాటిన వైనం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శనివారం నిప్పులు చెరిగారు. నిమ్మకూరులో యువ ప్రభంజన యాత్ర ప్రారంభించిన లోకేష్ పలుచోట్ల ప్రసంగించారు. ఢిల్లీ తలవంచే రోజు రాబోతోందని, రాబోయే ఎన్నికల్లో సీమాంధ్రలో 25కు 25 సీట్లు ఇవ్వాలని, 30 రోజుల్లో మనమేమిటో చూపిద్దామన్నారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవశాలి కావాలా? పీకల్లోతు అవినీతి రొచ్చులో కూరుకుపోయిన నేత కావాలా? తేల్చుకోవాలన్నారు. రోడ్ షో పొడవునా చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సంధిస్తూ.. తన తండ్రి చంద్రబాబు పాలనలో సంక్షేమాన్ని గుర్తు చేస్తూ.. మేనిఫెస్టో అమలుకు భరోసా ఇస్తూ... తొలిరోజు రోడ్ షోలో ప్రజలను ఆకట్టుకున్నారు.
గుడివాడ నెహ్రూచౌక్లో, విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించిన లోకేష్... జగన్పై ఘాటైన విమర్శలు చేశారు. నాలుగే నాలుగు సంతకాలతో ప్రజల జీవితాలు మార్చేస్తానంటున్న యువ నేత.. మన కోసం నాలుగు సంతకాలు పెట్టి మిగతా సంతకాలన్నీ కుటుంబం కోసం, అవినీతి మిత్రుల కోసం పెడతారని ఎద్దేవా చేశారు. టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో అమలుపై భరోసా ఇచ్చారు. 63 ఏళ్ల వయస్సులో చంద్రబాబు 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఆచరణ సాధ్యమయ్యే, ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే మేనిఫెస్టోను రూపొందించారన్నారు.
రైతాంగం చితికిపోతుంటే ఆత్మహత్యలు వద్దని, రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, టిడిపి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని కార్యాచరణ దిశగా తీసుకెళ్తామన్నారు. యువత ఉద్యోగ, ఉపాధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. నిరుపేదలకు రూ.5కే భోజనం పెట్టేందుకు ఎన్టీఆర్ భోజన పథకం అమలు చేస్తామంటూ మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, సాఫ్ట్వేర్ రంగం పురోగతి సాధించాలంటే దొంగలను చూసి పెట్టుబడులు పెట్టరని, బాబును సిఎం చేస్తేనే పెట్టుబడులు వస్తాయన్నారు.
అవినీతికి మద్దతు ఇస్తారో నిజాయితీకి పట్టమో ఆత్మ విమర్శ చేసుకుని ఓటు వేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కోస్టల్ కారిడార్ ఉన్నా పదేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఏటా 30 వేల మంది పట్టభద్రులవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది పట్టభద్రులవుతున్నారని, మరో 7 లక్షలు టెన్త్క్లాస్, ఇంటర్ పాసవుతున్నారని, వీరికి ఉపాధి కావాలంటే బాబు రావాలన్నారు.
హైదరాబాద్ నిర్మాణానికి 200 ఏళ్లు పడితే... సిక్రిందాబాద్ నిర్మాణానికి 100 ఏళ్లు పట్టిందని, కానీ చంద్రబాబు సైబరాబాద్ను కేవలం పదేళ్లలో పూర్తి చేశారన్నారు. తాను ఈ ఊరి మనవడిని, మీ జిల్లా అల్లుడిని.. అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు పేరు పేరునా నమస్కారాలు అన్నారు. అలాగే.. పార్టీని వీడి తమ తలపై పాలుపోసిన కొడాలి నానీకి నమస్కారాలు అంటూ గుడివాడ బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. పుణ్యభూమి నాదేశం నమో నమామి పాటను పూర్తిగా పాడిన లోకేశ్.. ఈ అద్భుతమైన పాటను తెలుగు జాతికి అందించినజాలాదిగారు గుడివాడలో పుట్టారని, గుడివాడ పౌరషం అన్నారు.