22న మోడీ చేతుల మీదుగా స్మిత హిందీ ఆల్బమ్
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం ప్రముఖ పాప్ గాయని, హాయ్ రబ్బా స్మిత తెలుగులో పాట పాడిన తెలిసిందే. మోడీ ప్రధాని కావాలని ఆమె పాట పాడారు. మోడీకి మద్దతుగా పాటను చిత్రీకరించిన స్మిత ఏప్రిల్ 8న ‘వేక్ అప్ ఇండియా' పేరుతో ఆల్బమ్ విడుదల చేశారు. ఈ సరికొత్త ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కాగా, ‘వేక్ అప్ ఇండియా' హిందీ వర్షన్ను ఏప్రిల్ 22న హైదరాబాద్ నగరానికి వస్తున్న నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ మంగళవారం హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ‘వేక్ అప్ ఇండియా' హిందీ వర్షన్ను ఎల్ఈడి తెరపై మోడీ ఆవిష్కరించనున్నారు.
‘వేక్ అప్ ఇండియా' తెలుగు వర్షన్ను ఏప్రిల్ 8న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు విడుదల చేశారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ఈ ఆల్బమ్ హల్చల్ చేసింది. యూట్యూబ్లో ఇప్పటి వరకు లక్ష మందికి పైగా ఆ ఆల్బమ్ వీక్షించారు.
మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ స్మిత ఆ ఆల్బమ్ను రూపొందించారు. ఆ ఆల్బమ్లో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కొన్ని ఘటనలు, గుజరాత్లో నరేంద్ర మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి అంశాలను చూపించారు. ఆ ఆల్బమ్కు నిహాల్ సంగీతం అందించారు. తెలుగు పాటకు లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్ కాగా, హిందీ పాటకు స్మిత తల్లి జోగులాంబ, యశ్వంత్లు అందించారు.