22న మోడీ పర్యటన: హైదరాబాద్లో దొరకని వేదిక
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏప్రిల్ 22న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం ఒంటిగంటకు నిజామాబాద్లో, మధ్యాహ్నం 2.15గంటలకు కరీంనగర్లో, సాయంత్రం 4 గంటలకు మహబూబ్నగర్లో, 5గంటలకు హైదరాబాద్లో జరిగే బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ కాదని, సగటు రాజకీయ పార్టేనని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి జైరారం రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ విషయంలో బిజెపి భుజాలపై తుపాకి పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కష్టమైనా, నష్టమైనా తెలంగాణ విషయంలో బిజెపి వెనక్కి తగ్గలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రూ. 5వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.
ఇది ఇలా ఉండగా హైదరాబాద్లో మోడీ బహిరంగ సభకు వేదిక ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. కాగా, ఎల్బి స్టేడియంలో మరమ్మతుల కారణంగా బహిరంగ సభకు అనుమతి లభించలేదు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గానీ, నిజాం కళాశాల మైదానంలో గానీ సభ నిర్వహించుకునేందుకు ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించే బిజెపి అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 23న నితిన్ గడ్కరీ, 24న మనోహర్ పారికర్, రవిశంకర్ ప్రసాద్, 25న సుష్మా స్వరాజ్, 26న బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు.