బాబుది ఆర్భాటమే: నాయని, మాపై బురద: కెటిఆర్
హైదరాబాద్/ నల్లగొండ: బియాస్ నది ప్రమాద బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వలేదని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిది ఆర్భాటం మాత్రమేనని, నష్టపరిహారం ప్రకటించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు.
బియాస్ ప్రమాద బాధితులకు నాయని నర్సింహా రెడ్డి గురువారం నష్టపరిహారం చెల్లించారు. బియాస్ ప్రమాద బాధితులకు చెక్కులు అందజేసినట్లు ఆయన తెలిపారు. బియాస్ ప్రమాదంపై విచారణను త్వరగా పూర్తిగా చేయాలని ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే ప్రమాదానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తాను బియాస్ నది చెంతకు వెళ్లానని, కేంద్ర హోం శాఖతో మాట్లాడి అధికారులను రప్పించామని ఆయన చెప్పారు. ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని ఆయన చెప్పారు. విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తోందని తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు విమర్శించారు. కౌన్సెలింగ్ జరపాలని ఏకపక్షంగా ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుందని, ఈ కౌన్సెలింగ్తో తెలంగాణ విద్యార్థులకు సంబంధం లేదని ఆయన గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని ఆయన సూచించారు. ఎంసెట్ కౌన్సెలింగ్కు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని కెటిఆర్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 500 గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ను తరిమికొట్టేందుకు గ్రామీణ శాఖలో ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరిస్తామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కార్యదక్షుడని, మాట మీద నిలబడ్డాడు కాబట్టే కెసిఆర్కు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని ఆయన చెప్పారు.