రైలు ప్రమాదంపై నాయిని: జగన్ ఉద్వేగం, తండ్రి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును ఓ రైలు ఢీకొనడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పందించారు. రైల్వే డిపార్టుమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
వాచ్మెన్ను నియమించాలని, గేటు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో చెబుతున్నప్పటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం వహించిందన్నారు. చాలామంది చిన్నారులు మృతి చెందారన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. రైల్వే జీఎం మీద, రైల్వే శాఖ మీద చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత రైల్వేదేనని మరో మంత్రి హరీష్ రావు అన్నారు. వారం రోజుల్లో గేటును ఏర్పాటు చేయించే బాధ్యత తనదే అన్నారు. మృతుల కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
కాగా, మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటన రైలు ఆలస్యం కావడం వల్లే చోటుచేసుకుందని తెలుస్తోంది. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ నేడు నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆ ఆలస్యమే చిన్నారుల పాలిట మృత్యుఘడియలుగా మారింది.
మాసాయిపేట లెవల్ క్రాసింగ్ ద్వారా ప్రయాణించే డ్రైవర్లందరికీ రైళ్ళ రాకపోకల సమయాలు తెలిసి ఉంటాయి కాబట్టే, ఆ సమయంలో ఏ రైలూ రాదని కాకతీయ విద్యామందిర్ స్కూల్ డ్రైవర్ మొండిగా బస్సును ముందుకురికించి ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక, పట్టాలపైకి వచ్చిన బస్సును ఒక్కసారిగా చూసినా బ్రేకులు వేయలేని నిస్సహాయత రైలు డ్రైవర్లది. సడెన్ బ్రేక్ వేస్తే మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉండడంతో వారు నిదానంగా బ్రేకులు వేయగా, బస్సును ఢీకొన్న రైలు అరకిలోమీటరు తర్వాత నిలిచిపోయింది.
స్కూల్ బస్సు ప్రమాద ఘటన ప్రాంతానికి జగన్
స్కూల్ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం సందర్శించారు. జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల బంధువులను, తల్లిదండ్రులను కేసీఆర్ పరామర్శించారు.
విలపించిన కిషన్ రెడ్డి
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని పలువురు నేతలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక విలపించారు. ఆ తర్వాత మృతుల తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చారు. అనంతరం అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో మాట్లాడారు.
తండ్రి మృతి
రైలును బస్సు ఢీకొనడంతో మృతి చెందిన చిన్నారుల్లో వహిదా, రజియా అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విషయం తెలిసిన వారి తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. మరోవైపు మృతదేహాలను తీసుకు వెళ్లకుండా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో సంఘటన స్థలంలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. మరోవైపు ప్రమాదం పైన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని
మెదక్ జిల్లా జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనా వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో ప్రమాదం విషయం తెలియడంతో క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాల్సిందిగా కేంద్ర మంత్రి సదానంద గౌడను ప్రధాని ఆదేశించారు.