బ్లైండ్ స్కూల్: సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సి
తూర్పుగోదావరి: కాకినాడలోని అంధుల పాఠశాల ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
కాకినాడలోని గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాల నిర్వాహకుడు, ప్రిన్సిపాల్ కలిసి అల్లరి చేస్తున్నారన్న కారణంతో ముగ్గురు విద్యార్థులను చితకబాదిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మీడియాలో విద్యార్థులను చితకబాదిన దృశ్యాలు ప్రసారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలపై దాడికి దిగారు.
కాగా, ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో డిఈఓ విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. పోలీసులు పాఠశాల నిర్వాహకుడిని, ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేశారు.
పాఠశాలపై చర్యలు తీసుకుంటాం: మంత్రి సుజాత
గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాల ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.