ఘోర ప్రమాదం: 7గురు మృతి, మరో ఘటనలో ఇద్దరు
మహబూబ్నగర్/వరంగల్: జిల్లాలో బుధవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మాగనూరు వద్ద ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మాగనూరు సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్నవారందరూ చెల్లెచెదురుగా పడిపోయారు.
ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆటో మాగనూరు మండలంలోని కృష్ణా గ్రామం నుంచి మక్తల్ వెళుతుండగా.. హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మక్తల్ సిఐ వెంకటేశ్వర్లు, మాగనూరు ఎస్ఐ అనిల్ కుమార్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వరంగల్: జిల్లాలోని మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు.