అయోమయం లేదు: టిడిపితో పొత్తుపై జవదేకర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఎలాంటి అయోమయం లేదని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూలును ఖరారు చేయడానికి హైదరాబాద్కు వచ్చిన ఆయన గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పొత్తుపై అయోమయం లేదని, తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడతామని, అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. శుక్రవారం ఉదయానికల్లా పొత్తుపై స్పష్టత వస్తుందని, పొత్తు రద్దయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని ధీమా వ్యక్తం చేశారు. పొత్తు నేపథ్యంలో రెండు మూడు సీట్ల విషయంలోనే ఇబ్బంది తలెత్తిందని, దీనిని పరిష్కరిస్తామని అన్నారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పొత్తు రద్దయిందని చెబుతున్నారు కదా అని ప్రశ్నిస్తే - తనకున్న సమాచారం మేరకు పొత్తును పునస్సమీక్షిస్తామని మాత్రమే చంద్రబాబు చెప్పారని తెలిపారు. తాను కుటుంబంతో వచ్చానని, శుక్రవారం తిరుపతి దర్శనానికి వెళుతున్నానని, అంతకు ముందే చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు. వ్యక్తిగతంగా చంద్రబాబును కలుస్తారా అని ప్రశ్నిస్తే - ఫోన్లో మాట్లాడతానని అన్నారు.
కాగా, బిజెపి నేతల చర్చలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పొత్తు లేదని చంద్రబాబు విజయనగరం జిల్లా గజపతినగరంలో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ సీమాంధ్రలో పొత్తు కుదరలేదని నర్మగర్భంగా అన్నారు.