బెజవాడ ఫస్ట్: విశాఖ మెట్రో రైలు ఆశలపై నీళ్లు?
విశాఖపట్నం: విశాఖపట్నంలో మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదన వెనక్కు వెళ్లినట్టే ఉందని అంటున్నారు. కేంద్ర అమోదం లభించిన మీదట ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) కోసం పిలిచిన టెండర్లకు దిక్కూమొక్కూ లేదు. అవశేష అంధ్రప్రదేశ్లో మెట్రోరైలు ప్రాజెక్టుల పర్యవేక్షణను ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్కు అప్పగించగా, ఆ సంస్థ అధినేత విజయవాడలోనే తొలి మెట్రోరైల్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు ప్రకటించడంతో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు వెనక్కి వెళ్లినట్లు భావించాల్సి ఉంటుందని అంటున్నారు.
రాష్ట్ర విభజనకు ముందే విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టాలని భావించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టుకు సానుకూలత వ్యక్తం చేసిన సంగతి విదితమే. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర పథక నివేదిక సిద్ధం చేసేందుకు కేంద్రం అంగీకారం కూడా తెలిపింది. ఇందుకోసం రూ 1.8 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. తొలిదశలో 20 నుంచి 25 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మించాలని భావించారు. కిలోమీటర్కు రూ. 250 కోట్ల చొప్పున రూ. 6000 కోట్లు ఖర్చవుతుందని భావించారు.
విలీన మున్సిపాలిటీలు భీమునిపట్నం, అనకాపల్లిలను కలుపుకుని నాలుగు మార్గాలను ప్రతిపాదిస్తూ డిపిఆర్ కోరుతూ టెండర్లను పిలిచారు. జాతీయ, అంతర్జాతీయంగా పేరొందిన 11 సంస్థలు డిపిఆర్కు అసక్తి వ్యక్తీకరిస్తూ టెండర్లు దాఖలు చేయగా ఆరింటిని ఎంపిక చేసి, వాటి శక్తిసామర్థ్యాలు పరిశీలించేందుకు కమిటీకి నివేదించాలని భావించారు. డిపిఆర్ సిద్ధం అవుతుందనుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ అధినేత శ్రీ్ధరన్ను రాష్ట్రంలో మెట్రోరైల్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్గా ప్రభుత్వం నియమించింది. ఇటీవల శ్రీధరన్ చేసిన వ్యాఖ్యలు విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు ఆశలపై నీళ్లు చల్లాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో మెట్రోరైల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తొలిదశలో విజయవాడకు మెట్రోరైల్ ప్రాజెక్టును మంజూరు చేసి పనులు చేపట్టే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే డిపిఆర్ తయారీకి టెండర్లను ఖరారు చేసే వరకూ వచ్చిన విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయినట్టైంది.