తమ్ముడొచ్చినా ఏం చేయలేడు: పవన్ కళ్యాణ్ పై చిరు
గుంటూరు/విశాఖ: తన తమ్ముడు పవన్ కళ్యాణే కాదు.. ఎవరొచ్చినా కాంగ్రెసు పార్టీని ఏమీ చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఎపి ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి గురువారం అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్లా కాదన్నారు. ఎంతోమంది ప్రయత్నించి వారే కనుమరుగయ్యారన్నారు. పేదల గుండెల్లో తమ పార్టీ సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు.
కాంగ్రెసు ఓ జీవనది అని, వచ్చేవారు వస్తుంటారు.. వెళ్లేవారు వెళ్తుంటారన్నారు. పార్టీ పునాదులు మాత్రం బలంగానే ఉంటాయని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అంటే తనకు గౌరవం ఉండేదని అయితే ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
టిడిపి, జగన్ పార్టీలు ఫ్యాక్షనిస్ట్ల కన్నా ప్రమాదకరమైనదని రఘువీరారెడ్డి విశాఖలో ఆరోపించారు. ఆ రెండు పార్టీలూ బహిరంగ వేలంలో ఓటర్లను కొనవచ్చన్న అహంకారంతో ఉన్నాయన్నారు. టిడిపి, జగన్ పార్టీలు ప్రజల కోసం పుట్టలేదని, రాజకీయం కోసమే పుట్టాయన్నారు. ఇటువంటి పార్టీలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాగ్దానాలు ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. ఫూల్స్ ప్యారడైజ్ను సృష్టించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని రఘువీరా విమర్శించారు. టిడిపికి ఒక సిద్ధాంతం లేదన్నారు. ప్రతి ఎన్నికకు సిద్ధాంతాలను మార్చుకోవడమే ఈ పార్టీ సిద్ధాంతమా అని ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చినట్టే కలలు కంటూ తాను పెట్టే సంతకాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు.